ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Joint Adilabad District) సిర్పూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం (Gram Panchayat Election Campaign) ముమ్మరంగా సాగుతోంది. సిర్పూర్ శాసన సభ్యుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish Babu) ప్రచారాన్ని ఉధృతం చేశారు. సిర్పూర్(టి) మండలంలోని సిర్పూర్(టి) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బేస్తవాడ, దుబ్బగూడ, పారిగాం గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు వోడ్డేటి నాగమణి నానయ్య, చనకపురే రాజక్కకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో గ్రామీణాభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నయా పైసా కేటాయించలేదని మండిపడ్డారు. కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి వయా కాగజ్నగర్, సిర్పూర్ మీదుగా మాకుడి వరకు డబుల్ రోడ్ మంజూరు చేయించానని వెల్లడించారు.
‘సిర్పూర్ టౌన్లోని మెయిన్ రోడ్ మధ్యలో డివైడర్లు నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేస్తా. సిర్పూర్ రైల్వే స్టేషన్ నుంచి డౌనల్ వరకు రోడ్ పూర్తిగా పాడైపోయితే కొత్త రోడ్ నిర్మించాం. పారిగాం గ్రామస్తులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం’ అని అన్నారు.
ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ మండల ఇన్ఛార్జ్ విశాల్ రావు, మాజీ కౌన్సిలర్లు విశ్వేశ్వర్ రావు, సింధం శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు నీరటి సత్యనారాయణ, అభినయ్ కమలాకర్, దుర్గం ప్రశాంత్, సాయి భనర్కర్, యువరాజు, మనోజ్, అనిల్, మనోజ్ మండల్, తిరుపతి, ఉద్ధవ్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
