తిరుపతి: తిరుచానూరు(Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో (Karthika Brahmotsavam) భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Endowments Minister Anam Ramanarayana Reddy).. అమ్మవారికి పట్టు వస్త్రాలు (Silk Cloths) సమర్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమన్వయంతో టిటిడి (TTD) అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి, సూళ్లూరుపేట ఎంఎల్ఏలు పులివర్తి నాని, నెలవల విజయశ్రీ, టిటిడి జేఈఓ వీరబ్రహ్మం, అధికారులు హాజరయ్యారు. పట్టు వస్త్రాలను సమర్పించడానికి వచ్చిన మంత్రివర్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పద్మావతి అమ్మవారి దర్శనానంతరం మంత్రికి ఆలయ మర్యాదలు, వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలను అందించారు.
ఈ నెల 25 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 20వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) రానున్నారు. తర్వాత రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమం లో యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎంఎల్ఏ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి కార్పొరేషన్ ఉపమేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
