30 విభాగాలతో రోగులకు సేవలు
కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో వైద్యం, నిర్వహణ
రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్
భవనాల నిర్మాణ పురోగతి వివరించిన నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 23: సనత్ నగర్(Sanath Nagar)లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్: Tims)లో నెల రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ (R & B) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. టిమ్స్ లో 30 విభాగాలు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో రోగులకు సేవలు అందిస్తాయని తెలిపారు. ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రుల (Corporate Hospital) స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. గురువారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ (Hyderabad Collector) దాసరి హరి చందన, అదనపు కలెక్టర్ జి . ముకుంద రెడ్డి, రహదారులు , భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వర్ రెడ్డి,లింగారెడ్డి, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ మేనేజర్లు జి ఏ కే స్వామి నాయుడు, వి.శ్రీనివాసరావులతో కలిసి సనత్ నగర్ టిమ్స్ తో పాటు, ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital) నూతన భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.

టిమ్స్ లోనిర్మాణం పూర్తి ఐన భవనాలు, వైద్య పరికరాల అమరిక తదితరాలను పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ ఏర్పాట్లు యెంత వరకు వచ్చాయో పరిశీలించారు. టిమ్స్ , ఉస్మానియా ఆసుపత్రులను నిర్మిస్తున్న ఎంఈఐఎల్ (Meil) తరపున ప్రాజెక్ట్స్ విభాగం అధ్యక్షుడు కే గోవర్ధన్ రెడ్డి నిర్మాణం వివరాలను వికాస్ రాజ్ తో పాటు కలెక్టర్ హరి చందన తదితరులకు వివరించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి 15 రోజుల్లో సిద్ధం అవుతుందన్నారు. దీని ప్రారంభ తేదీని త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. నెల రోజుల్లో ఇక్కడి నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభం అవుతాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు మాదిరిగా ఇక్కడ సేవలు అందించటంతో పాటు నిర్వహణ కూడా ఉంటుందని చెప్పారు.
టిమ్స్ నిర్మాణానికి ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. ప్రభుత్వం నెల వారీ నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. తెలంగాణాలో నిర్మిస్తున్న టిమ్స్ , వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య, వైద్యేతర సిబ్బంది నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంటోందని వివరించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అనుకున్న గడువులోగా భవనాల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారని చెప్పారు. ఈ ఆసుపత్రి భవనాల నిర్మాణానికి కూడా ఎలాంటి నిధుల కొరత లేదన్నారు.
సనత్ నగర్ టిమ్స్ ప్రత్యేకతలు ఇవే…
ప్రభుత్వ ఛాతి వైద్యశాలలో టిమ్స్ కు కేటాయించిన 22. 6 ఎకరాల్లో 11, 68, 344 చదరపు అడుగుల్లో నిర్మాణం.
ప్రధాన బిల్డింగ్ :
బ్లాక్ ఏ- అత్యవసర సేవలు, ఆపరేషన్ థియేటర్స్ 15, ఐ సి యూలు -30.
బ్లాక్ బి- ప్రధాన ఓపీడీ నమోదు, సెంట్రలైజ్డ్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లై నాక్ , క్యాథ్ లాబ్స్,
బ్లాక్ సి- రేడియాలజీ విభాగం, పాథోలోజికల్ లాబ్స్, జనరల్ వార్డ్స్, ప్రైవేట్ వార్డ్స్, వి ఐ పీ సూట్స్.
బ్లాక్ డి – పరిపాలన, అకాడమిక్ బ్లాక్ 200 మంది కూర్చునే సామర్ధ్యం కలిగిన ఆడిటోరియం తో సహా.
మొత్తం వెయ్యి పడకలతో ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఇందులో ఐసీయూ పడకలు మూడొందలు, జనరల్ వార్డ్ పడకలు ఐదొందలు, ప్రైవేట్ వార్డ్స్ లో రెండొందల పడకలు ఉంటాయి. డయాలసిస్ పడకలు 30 ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 16 మేజర్, ఆరు మైనర్ ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు అవుతున్నాయి. పాథాలజీ లాబ్స్ 17, మైక్రోబయాలజీ లాబ్స్ 12, బయో కెమిస్ట్రీ లాబ్స్ పది, ఇతర లాబ్స్ ఐదు, ఎం ఆర్ ఐ 3. 0 టి ఆర్ యంత్రం ఒకటి, సి టి స్కాన్ 128 స్లైస్ ఒకటి, మమోగ్రఫీ యంత్రం ఒకటి, ఐదు ఎక్సరే యంత్రాలు, క్యాత్ లాబ్స్ రెండు, లి నాక్ న్యూక్లియర్ మెడిసిన్ వార్డ్ ఒకటి ఉంటాయి. రోగులకు సహాయకులుగా వచ్చే రెండొందల మందికి ఆశ్రయం కల్పించేలా ధర్మశాల, వెయ్యి పడకల ఆసుపత్రికి సరిపడేలా కేంద్రీకృత వంటశాల, లాండ్రీ, 30 మృతదేహాలను భద్రపరిచేలా శవాగారం టిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు.
