వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కల్తీ నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు కల్తీనూనె విక్రయిస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి వెళ్తున్నారే తప్ప కల్తీ నూనె విక్రయాలను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వివిధ ప్రాంతాల నుంచి డ్రమ్ములు, క్యాన్లలో నూనెను వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. అలాగే లూజు నూనె పేరుతో విక్రయిస్తున్నారు.కొన్ని ప్రాంతంలలో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు నకిలీ నూనెను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన నూనెనా, కల్తీనూనెనా తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు.
మంచినూనె ధర కిలోకు రూ.160చేరుకుంది. మంచి నూనె ప్యాకెట్లు ఇప్పుడు రూ.110 నుంచి 160వరకు పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు లూజు నూనె పేరుతో కల్తీనూనె విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స, తూనికల కొలతలు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కల్తీనూనె విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. కల్తీనూనెతో అనారోగ్యానికి గురవుతున్నారని, పచ్చడి పెడితే నెల రోజులు కూడా నిల్వ ఉండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స, రెవెన్యూ, ఫుడ్ ఇనస్పెక్టర్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కల్తీనూనె విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.