న్యూఢిల్లీలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతీయ రాజధానిలోని కర్తవ్య పథ్(Kartavya Path)లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor), 150 ఏళ్ల వందేమాతరం (Vandemataram) ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం మోహరించిన ప్రధాన ఆయుధ వ్యవస్థల ప్రతిరూపాలను ప్రదర్శించే త్రివిధ దళాల శకటం విశేషంగా ఆకట్టుకుంది. సైనిక పరాక్రమంతోపాటు దేశ సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక వృద్ధిని అద్భుతంగా ప్రదర్శించారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu), కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లేయన్ సాంప్రదాయ బగ్గీలో కర్తవ్య పథ్ వద్దకు చేరుకున్న తర్వాత గౌరవ వందనం స్వీకరించడంతో కవాతు ప్రారంభమైంది. ప్రధాని మోదీ(PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ కేంద్ర మంత్రులు, ఉన్నత సైనిక అధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, పౌర సేవకులు హాజరయ్యారు. వివిదతా మే ఏక్తా(భిన్నత్వంలో ఏకత్వం) అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కవాతులో దాదాపు 100 మంది కళాకారులు పాల్గొన్నారు. దేశ ఐక్యత, గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే సంగీత వాయిద్యాల గొప్ప ప్రదర్శన జరిగింది. ఈ కవాతుకు పరేడ్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ భవ్నీష్ కుమార్ నాయకత్వం వహించారు.
