- వెల్లడించిన ద్రవ్య విధాన కమిటీ బహిర్గత సభ్యుడు సౌగత భట్టాచార్య..
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నా.. మున్ముందు ఆర్బీఐ రెపోరేటు పెరిగేందుకు తక్కువ అవకాశాలే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ బహిర్గత సభ్యుడు సౌగత భట్టాచార్య అభిప్రాయపడ్డారు. పీటీఐకి ఓ ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణంతో మెటల్స్, ముడి చమురు ధరలు క్రమేణా పెరుగుతున్నాయని, ఇది వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నదని భట్టాచార్య పేర్కొన్నారు.
అయినప్పటికీ రాబోయే ద్రవ్య సమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అంచనా వేశారు. నిజానికి భట్టాచార్య, మరో ఐదుగురు ఎంపీసీ సభ్యులు.. ఈ నెల ఆరంభంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 5.25 శాతం వద్దే ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
తద్వారా ఆర్బీఐ తమ న్యూట్రల్ పాలసీ వైఖరిని కొనసాగించినైట్టెంది. అంతేగాక మరికొంత కాలం వడ్డీరేట్లు తక్కువ శ్రేణిలోనే ఉండవచ్చన్న సంకేతాలనూ ఇచ్చింది. కాగా, కేంద్ర ప్రభుత్వం పలు రకాల ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నదని, అందుకే దేశ ఆర్థిక వ్యవస్థపై భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తక్కువగానే ఉంటుందని ఈ సందర్భంగా భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా రెపోరేటును ఆర్బీఐ 125 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే.
