- ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు..
గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో రూ. 1,500 కోట్ల సైబర్ మోసం కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుందని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఆదిలుద్దీన్ మహమ్మద్.. తెలంగాణకు చెందిన ఇతను మ్యూల్ అకౌంట్స్ అంటే ఇతరుల పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలు లోకి డబ్బును బదిలీ చేయడం, తిరిగి ‘అంగడియా’ అంటే సాంప్రదాయ కొరియర్ ద్వారా ఆ డబ్బును అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
మిహిర్ రంగాని, హిరెన్ లింబాసియా అనే వ్యక్తులు రాజ్కోట్కు చెందిన వారు.. వీరిద్దరూ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడం, నగదు విత్డ్రా చేయడం, నిధులను బదిలీ చేసే బాధ్యతలను చూసుకునేవారు.
నిందితులు వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో 15 ఖాతాలను తెరిచారు. వీటిని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ కి చెందిన మార్కెటింగ్ యార్డ్ సంస్థల ద్వారా వ్యూహాత్మకంగా నిర్వహించారు. “ఏపీఎంసీ ఖాతాల్లో జీ.ఎస్.టి., టీడీఎస్ నిబంధనల అమలు ఇతర ఖాతాల మాదిరిగా కఠినంగా ఉండదు. అందుకే వీటిని దుర్వినియోగం చేయడం సులభమైంది. ఈ ఖాతాల ద్వారా సైబర్ మోసాలు, గేమింగ్ లావాదేవీలు, జీ.ఎస్.టి.కి సంబంధించిన సుమారు రూ. 1,500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు మా విచారణలో తేలింది.. అని రాజ్కోట్ రూరల్ ఎస్పీ విజయ్ గుర్జార్ వివరించారు.
సైబర్ క్రైమ్ పోర్టల్-1930లో ఈ కేసుకు సంబంధించి మొత్తం 180 ఫిర్యాదులు నమోదయ్యాయి.. గుజరాత్ 21 ఫిర్యాదులు (రూ. 2.94 కోట్లు). ఇతర రాష్ట్రాలు.. 159 ఫిర్యాదులు (రూ. 20.21 కోట్లు). ఫిబ్రవరి 13వ తేదీన ఇదే కేసులో ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు..
