- పోతన మనవాడు కావడం మన అదృష్టం..
భక్త కవి పోతన.. అధ్యాత్మ భావనను పూత పూసి, పోత పోసిన పద్యాలు.. పరమ భాగవతులు ప్రవచించి తరించారు. పామరులు సైతం విని పరవశించారు. సాధకులు వరమని భావించారు. మోక్షానికి మార్గం ఇదేనని తీర్మానించుకున్నారు. నవరస భరిత భాగవతానికి పోతన మధురిమ తోడై.. ఎన్నెన్నో ఆధ్యాత్మిక రహస్యాలకు నిలువ నీడైంది. పోతన భాగవతం, వ్యాస భాగవతానికి అక్షరానువాదం కాదు.
యథా నుసరణానువాదమని ఉభయ భాగవతాల అధ్యయనపరులకు అనుభవైకవేద్యమే. భక్తిరస పోషణ, ఆవిష్కరణలో కూడా పోతన మేను మరచి ‘ఇంతింతై… బ్రహ్మాండాంత సంవర్ధియై’ అన్నట్టు విశ్వరూపం చూపి మూలాన్ని మించి మురిపించాడు. అందుకే తెలుగు భాగవతం.. మూలం కంటే దాదాపు మూడింతలు పెరిగింది. భాగవత పురాణం వేదమనే కల్పవృక్షం నుంచి జారిన ఫలం. అది శుకముని ముఖంలోని అమృత ద్రవంతో నిండి నిబిడీకృతమై ఉంది.
