మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ గరీమ ఆదేశం
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరీమ అగ్రవాల్ కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పిహెచ్సి) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను, పరిపాలనా తీరును ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా ఆమె మొదట హాజరు, ఓపీ (ఔట్ పేషెంట్) రిజిస్టర్లను, మందుల ధృవీకరణ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి వైద్య సిబ్బందితో మాట్లాడిన అదనపు కలెక్టర్, ఆసుపత్రిలో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు మరియు మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించాలని ఆమె వైద్య సిబ్బందిని ఆదేశించారు.
