వరంగల్ కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని పెండ్యాల మమత ను ఆ విభాగం అధ్యాపకులు, పరిశోధకులు శాలువతో సన్మానించి, అభినందనలు తెలపడం జరిగింది. పెండ్యాల మమత ఇటీవల ఢిల్లీలో ఈనెల 8 నుండి 13 వరకు జరిగిన ఇంటర్నేషనల్ ప్యారా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని షాట్ పుట్, జావలింగ్ త్రో విభాగం క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించి తృతీయ స్థానంలో నిలిచి, పథకాలతో పాటు బహుమతులు సాధించింది.

వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, కమ్మపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల మమత రాజనీతి శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థినిగా కొనసాగుతూనే, అథ్లెటిక్స్ లో రాణించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు, బహుమతులు సాధించి, యూనివర్సిటీకి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అధ్యాపకులు, పరిశోధకులు కాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య, డాక్టర్ వి. సత్యనారాయణ, డాక్టర్ వి. నాగరాజు, పరిశోధక విద్యార్థులు కల్లేపల్లి ప్రశాంత్, కేతపాక ప్రసాద్, రవి, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
