- పద్మారావు గౌడ్
- బౌద్ధ నగర్ లో 94.20 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలుపుతున్నామని,అయితే ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
మంగళవారం బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా అశోక్ నగర్,లలిత నగర్,శకుంతల స్కూల్,ఈశ్వరి బాయి నగర్,అంబర్ నగర్ ప్రాంతాల్లో రూ.94.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే బౌద్ధనగర్ కనకదుర్గ ఆలయం వద్ద రూ.55 లక్షల వ్యయంతో నాలా బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని,అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ మాట్లాడుతూ,సికింద్రాబాద్ ఎమ్మెల్యే సహకారంతో డివిజన్లో పలు అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సువర్ణలత,మాధవి,వేణు, ప్రియాంక,కార్పొరేటర్ సామల హేమ,సమన్వయకర్త రాజ సుందర్తో పాటు నాయకులు,అధికారులు పాల్గొన్నారు.అనంతరం డివిజన్లో విస్తృతంగా పర్యటించిన పద్మారావు గౌడ్,ప్రజల నుంచి వినతులు స్వీకరించి పలు సమస్యలపై స్పందిస్తూ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
