- ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత
- సికింద్రాబాద్లో 152 మందికి కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ప్రతి ఇంటికీ వివిధ సంక్షేమ పథకాలను చేరవేసిన ఘనత గత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికే దక్కిందని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.పేద ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి,పేదల వివాహాలు భారంగా మారకుండా కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు.సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 152 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం మధురానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సికింద్రాబాద్కు చెందిన అత్యధిక మందికి గతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చామని చెప్పారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని,ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ,కంది శైలజ,లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్,రాసూరి సునీత,తహసీల్దార్లు ప్రతాప్ సింగ్,అసదుల్లా ఖాన్తో పాటు అధికారులు,నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 93 మందికి కళ్యాణలక్ష్మి,59 మందికి షాదీ ముబారక్ చెక్కులను పద్మారావు గౌడ్ అందజేశారు.
