యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఆలయంలో నిత్య ఆరాధన అనంతరం చతుర్వేద పారాయణములు, నిత్యహవనములు, మూలమంత్రమూర్తి మంత్ర జపములు నిర్వహించారు. అనంతరం పాంచరాత్రగమరీత్యా మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకోటికి వివిధ మంత్రములు చేత హవిస్సులు అందజేసి సువృష్టిని, లోక క్షేమమును కలిగించమని వేడుకొనుటయే మహా పూర్ణాహుతి ప్రత్యేకత.

చక్రతీర్థ స్నానము :
మహా పూర్ణాహుతి అనంతరం స్వామివారికి చక్రతీర్థ స్నానము నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారిని పుష్కరిణిలో వేంచేపు చేసి పవిత్ర స్నానము చేయిస్తారు. బ్రహ్మోత్సవముల ముగింపు సూచికముగా ఈ వేడుకలు నిర్వహిస్తారు.

సాయంకాలం దేవతోద్వాసన, శ్రీ పుష్పయాగము, డోలారోహణము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో భవాని శంకర్ ,చైర్మన్ నరసింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ మహేష్, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు, ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


