- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. వేసవికాల ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని వివరించారు. వడదెబ్బన బారినపడిన ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలలోనే మెరుగైన చికిత్స అందించాలని అన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చేలా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బస్టాండ్లు, ప్రధాన కూడళ్ళు, జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలకు విరివిగా ఓఆర్ఎస్ పొట్లాలు పంపిణీ చేస్తూ ఉండాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు అధిక ఉష్ణోగ్రత సమయంలో జాగ్రత్తవగా ఉండాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ, వడదెబ్బ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే జనాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు.

జిల్లాలో ఎక్కడా కూడా ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైనచోట బోరు బావులకు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీటి ఇబ్బందులు ఏర్పడితే, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సమస్యలు తీర్చాలన్నారు. వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువ సంభవించేందుకు ఆస్కారం ఉన్నందున అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
