బీజేపీ తాజా మాజీ అధ్యక్షుడు(Bjp Former President) జేపీ నడ్డా(JP Nadda)కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ధన్యవాదాలు(Thanks) తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. అందులోని అంశాలు.. “జేపీ నడ్డా గారు.. మీ నాయకత్వంలో గత ఆరేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించింది. మీరు చూపిన దూరదృష్టి, నిపుణత, పట్టుదల.. ఇవన్నీ పార్టీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలిచి, వారిలో ఆత్మవిశ్వాసం నింపారు.
మీ ఆధ్వర్యంలో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం(historic victory) సాధించింది. అనేక రాష్ట్రాల్లో, కీలకమైన ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఆరేళ్లుగా మీరు పార్టీకి అందించిన సేవలు వెలకట్టలేనివి. మీతో కలిసి పనిచేసే అవకాశం లభించడం మాకు గర్వంగా ఉంది. మీ నుంచి ఎన్నో నేర్చుకున్నాం. ప్రత్యేకంగా మీ అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలు, నాయకత్వ దృక్పథం మమ్మల్ని ఎంతో ప్రభావితం చేశాయి. మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీరు మమ్మల్ని ఆత్మీయంగా దగ్గరకు తీసుకొని మాకు స్ఫూర్తినిచ్చారు.
మీ మార్గదర్శకత్వం, మీ సహజమైన ఆత్మీయత మా అందరికీ దిశానిర్దేశం. స్ఫూర్తి నింపే మీ నాయకత్వం, పట్టుదలతో కూడిన మీ నిర్ణయాలు, కార్యకర్తలకు అండగా నిలిచే ధైర్యం మాకు మార్గదర్శకాలు. మీరు బీజేపీకి బలం. మీ నాయకత్వం మాకు ఎప్పటికీ ఆదర్శవంతం, ఆచరణీయం. మీతో కలిసి పనిచేయడం నిజంగానే గర్వకారణం. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
