సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో డ్యాన్స్
వారితో కలిసి కాలు కదిపిన మంత్రి సీతక్క
సమ్మక్క సారలమ్మ మహాజాతర(Sammakka Saralamma Mahajatara) ప్రారంభం కాకముందే దేశవిదేశాల నుంచి భక్తులు మేడారానికి విచ్చేస్తున్నారు. సోమవారం న్యూజిలాండ్ ప్రతినిధులు(Newzealand Delegates) రావటం గమనార్హం. ఆ దేశంలోని మావోరి తెగ(Maori Tribes)వాళ్లు ఈ గిరిజన జాతరను సందర్శించటం విశేషం. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో వాళ్లు తమ సంప్రదాయ నృత్యం హాకాను ప్రదర్శించటం ఆకట్టుకుంది. ఈ సందర్శనకు సంబంధించి మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడిలో భాగంగా ఈ కార్యక్రమంలో జరిగింది. ఆ కళాకారులతో కలిసి సీతక్క సైతం నృత్యం చేయటం చెప్పుకోదగ్గ విషయం. దీంతో వాళ్లు మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసీలు అడవి మీద, ప్రకృతి పైనే ఆధారపడి జీవనం సాగిస్తారని తెలిపారు. ప్రపంచం నలుమూలలా ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. అనంతరం.. మావోరి తెగ ప్రతినిధులను గద్దెల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు. సమ్మక్క సారలమ్మల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క.. వారికి వివరించారు. బంగారంతోపాటు వన దేవతల ప్రసాదాన్ని అందజేసి సన్మానించారు.
