- తిరుగులేని ఆధిక్యంతో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది
- ధీమా వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో… కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు భారీ మెజారిటీ వస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ జరిగిన తీరు, క్షేత్ర స్థాయిలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు భారీ మెజారిటీ వస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిపై ఆయన స్పందించారు. చాలా ప్రశాంతంగా ఉప ఎన్నిక జరిగిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తమ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చినట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లుగా అక్కడ ఉన్న తమ నాయకుల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ మహేశ్ కుమార్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మహిళ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ విభాగాలతోపాటు సీనియర్ నాయకులు అందరూ ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారన్నారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండటంతో.. తమ అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. భారీ మెజారిటీతో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
