- కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన
- రాజస్థాన్ వేదికగా కార్యక్రమం..
సర్వైకల్ క్యాన్సర్పై ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిర్మూలించే లక్ష్యంతో 14 ఏళ్లు పైబడిన బాలికల కోసం రూపొందించిన హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని సమక్షంలో పలువురు పాఠశాల విద్యార్థినులకు టీకాలు వేశారు. అనంతరం మోదీ వారితో ముచ్చటించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. నివారణ ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ కార్యక్రమం నిదర్శనమని పేర్కొంది.
రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. కిషన్గఢ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, గవర్నర్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో జైపూర్-బండికుయ్ ఎక్స్ప్రెస్వే, అమృత్సర్-జామ్నగర్ ఎకనామిక్ కారిడార్లోని ఓ భాగాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే జోధ్పూర్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిర్మించనున్న నాలుగు లేన్ల ఎలివేటెడ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
