- ట్వీట్ చేసిన చంద్రబాబు, లోకేష్..
హోలీ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను పురస్కరించుకుని ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ‘హోలీ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని తన పోస్టులో పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ తన సందేశంలో.. ‘వసంత రుతువుకు స్వాగతం పలికే రంగుల సంబరం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. సమత, మమతలకు చిహ్నంగా, పేదా, పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు చూడకుండా రంగుల్లో అంతా కలిసిపోయి ఆనందాలను పంచుకునే హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు’ అని తెలిపారు.
