యాదవ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని సీఎం రేవంత్ వ్యాఖ్య
హైదరాబాద్లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇందిరా పార్క్-ఎన్టీఆర్ స్టేడియంలో యాదవ సోదరులు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నమ్మిన వారికోసం ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా యాదవులు అండగా నిలబడతారని, వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని ప్రశంసించారు.

యాదవ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని, ఎంతో చరిత్ర కలిగిన సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరినప్పుడు వెంటనే ఆమోదించడమే కాకుండా నిధులు కేటాయించామని గుర్తుచేశారు. యాదవుల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తోపాటు సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

