- పాకిస్తాన్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో అసహనానికి గురి..
- శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార్ దిసనాయకేతో కలిసి మ్యాచ్ చూసిన వైనం..
టీ20 వరల్డ్కప్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఇండియా 61 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ను వీక్షించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ వచ్చారు. ప్రేమదాస స్టేడియంలోని వీవీఐపీ గ్యాలరీ నుంచి ఆయన మ్యాచ్ను వీక్షించారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో కలిసి మ్యాచ్ను తిలకించారు. అయితే పాకిస్థాన్ ఛేజింగ్ చేస్తున్న సమయంలో .. స్టేడియం నుంచి నఖ్వీ మధ్యలో వెళ్లిపోయినట్లు వీడియో రిలీజైంది. ఇంకా మ్యాచ్ పూర్తి కాకముందే నఖ్వీ తన గ్యాలరీ నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. 12వ ఓవర్లో మొహమ్మద్ నవాజ్ క్యాచ్ అవుట్ కాగానే.. స్టేడియం నుంచి నఖ్వీ వెళ్లిపోయారు. అక్కడి మీడియా కూడా ఈ విషయాన్ని ద్రుకవీరించింది. ఐసీసీ చైర్మెన్ జే షాను కలిసేందుకు నఖ్వీ వచ్చినట్లు తెలుస్తున్నా.. ఆ ఇద్దరూ భేటీ అయినట్లు సమాచారం లేదు. శ్రీలంక క్రికెట్కు చెందిన అధికారులతో నఖ్వీ భేటీ అయ్యారు.
అయితే ఆసియాకప్ సమయంలో దుబాయ్లోని స్టేడియం నుంచి వెళ్లిపోవడానికి నఖ్వీ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా గెలిచినా.. నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు మనవాళ్లు ఆసక్తి చూపలేదు. కానీ నఖ్వీ మాత్రం ట్రోఫీ అందజేసేందుకు స్టేడియంలోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ట్రోఫీతో వెళ్లిపోయిన నఖ్వీ.. ఇంత వరకు ఆసియాకప్ ట్రోఫీని ఇండియాకు అప్పగించలేదు.
ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతను అత్యధికంగా 40 బంతుల్లో 77 రన్స్ స్కోరు చేశాడు. అయితే చేజింగ్లో పాకిస్థాన్ చితికిలపడింది. పవర్ ప్లేలోనే పాక్ బ్యాటర్లు తడబడ్డారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీసుకుని పాక్ను కట్టడి చేశారు. హిట్టర్లు ఫర్హాన్, అయూబ్, సల్మాన్ ఆఘాలను సులువుగా ఔట్ చేశారు. దీంతో కేవలం 114 పరుగులకే పాక్ ఆలౌటైంది.
