- కట్టంగూర్లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి..
పేద ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రోజున కట్టంగూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను (57) మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను (29) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ… మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు.

పదేళ్ల పాలనలో భారీ అప్పులు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వేరేశం తీవ్ర విమర్శలు గుప్పించారు. “బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దాదాపు రూ. 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు” అని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఉపయోగపడేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు. పేదల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచామని తెలిపారు.నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కోసం త్వరలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు. పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, త్వరలో దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను కూడా కేటాయిస్తామని తెలిపారు. దేశంలో పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
