గౌరవెల్లి సహా తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులపై..
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శితో మంత్రి పొన్నం భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో గౌరవెల్లి (Gauravelli) సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు (irrigation projects) త్వరగా పర్యావరణ అనుమతులు (Permissions) మంజూరు చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి (Minister of Transportation and BC Welfare) పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) కోరారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయి కుమార్కు విజ్ఞప్తి చేశారు. సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ న్యూఢిల్లీలో తన్మయి కుమార్తో భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులు, వాటికి అనుమతులపై చర్చించారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులిస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని మంత్రి వివరించారు. కేంద్ర మంత్రి (Union Minister) భూపేందర్ యాదవ్ ( Bhupender Yadav) విదేశాల్లో ఉన్న కారణంగా తన్మయి కుమార్ను కలిశామని మంత్రి చెప్పారు.
దీనిపై తన్మయి కుమార్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఏడాది మే నెలలో ఇచ్చిన ‘వనశక్తి’ తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని తెలిపారు. అయితే.. దీనిపై న్యాయసలహా తీసుకొని ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

