శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలు
పుణెలోని పుస్తక మహోత్సవంలో..
విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విదేశాంగ శాఖ మంత్రి(Minister of Foreign Affairs) జైశంకర్.. పుణె(Pune)లోని పుస్తక మహోత్సవం(Book Festival)లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశ రాజకీయాలు(Politics), పరిపాలన(Administration), సంస్కృతీ సంప్రదాయాల(Cultural Traditions) ప్రాముఖ్యతపై ప్రసంగించారు. శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని, తాను కూడా వారి బాటలోనే ముందుకు వెళుతున్నానని చెప్పారు. రామాయణంలో హనుమంతుడు, మహాభారతంలో శ్రీకృష్ణుడు దౌత్యవేత్తలుగా తమ విధులను చక్కగా నిర్వహించారని పేర్కొన్నారు.
‘భారత రాజకీయ వ్యవస్థ, పాలనలో వ్యూహాత్మక నిర్ణయాలు, సుదీర్ఘ రాజ్య నిర్వహణ విధానాల గురించి విదేశీయులు ఎన్నో పుస్తకాల్లో తప్పుగా రాశారు. అవి చదివితే మన అసమర్థత అనిపిస్తుంది. కానీ.. మనం అనుసరించిన సంప్రదాయాలు, ఆచారాలు, మన సంస్కృతి గురించి ఆ పుస్తక రచయితలకు, ప్రపంచానికి తెలియకపోవడం వల్ల తప్పుగా అర్థంచేసుకోవడం జరుగుతోంది’ అని జైశంకర్ అన్నారు.
ఈ సందర్భంగా జైశంకర్.. రామాయణం, మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాల్లోని దౌత్య, రాజకీయ వ్యూహాలను ఉదాహరించారు. రామాయణంలో హనుమంతుడు సీతకు సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా తెచ్చిన విధానం, రావణుడిలో భయాన్ని నింపిన వ్యవహారం అతనిలోని నాయకత్వ లక్షణాలకు అద్దంపడుతుందని చెప్పారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు.. పాండవులకు, కౌరవులకు మధ్య శాంతిని ఏర్పరచేందుకు ప్రయత్నాలు చేసి ధర్మం పక్షాన నిలబడటం ద్వారా అత్యుత్తమ దౌత్యకళను ప్రదర్శించాడని పేర్కొన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని తాను ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం కోసం పనిస్తున్నానని జైశంకర్ చెప్పారు.
