విచారణ అర్హత లేని పిటిషన్(Petition Without Merit Of Hearing) వేసి ఏపీ ప్రభుత్వం(AP Government) అక్రమంగా(Illegal) నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్(Polavaram-Nallamala Sagar)కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు (Supreme Court) సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి, మెదక్ ఎమ్మెల్యే(Medak MLA) హరీష్ రావు అన్నారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు.
‘ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా? రిట్ విత్ డ్రా చేయించడానికే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటూ బూటూ వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లారా? సీఎంగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి ధారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం ఇది. రిట్ ఉపసంహరించుకొని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమే. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే.
ఈలోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తిచేసుకొని తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుంది. సంక్రాంతి పండుగ వేళ రేవంత్.. చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్.పోలవరం నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తోంది. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్కు వెళ్లాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు.పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశాడు.
వేయనంటూనే కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్కు మద్దతు ప్రకటించాడు. మేం నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి.. నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశాడు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చించుకుందామన్న రేవంత్ రెడ్డి.. మాటల అంతర్యమేంటి?.
తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యం. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా?. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డీ.. నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. నీ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తాం’ అని హరీష్ రావు హెచ్చరించారు.

