Saturday, April 11, 2026
Homeరంగారెడ్డిCybercrime | సైబర్ మాయగాళ్లపై మల్కాజిగిరి పోలీసుల కొరడా

Cybercrime | సైబర్ మాయగాళ్లపై మల్కాజిగిరి పోలీసుల కొరడా

  • వారం రోజుల్లో రెండు కేసుల ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లపై మల్కాజిగిరి పోలీసులు పంజా విసిరారు. గత వారం రోజులుగా సాగించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా పెట్టుబడి, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాల గుట్టు రట్టు చేశారు. ఈ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల ఖాతాలను పరిశీలించగా వీరికి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

ట్రేడింగ్ పేరుతో నిలువు దోపిడీ!
మల్కాజిగిరిలో రూ. 41.56 లక్షల మోసం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌: అధిక లాభాల ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొట్టిన ‘ఇన్వెస్ట్‌మెంట్’ మాయగాడిని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగోల్‌కు చెందిన చామల బాలకిషన్ రెడ్డి సైబర్ కేటుగాళ్లకు కమిషన్ ప్రాతిపదికన బ్యాంక్ ఖాతాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

ఏమిటీ ఉదంతం?: బాధితుడిని ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చి ‘FISD PRO’ అనే నకిలీ యాప్ ద్వారా స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట్లో కొంత నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత బాధితుడితో రూ. 41.62 లక్షలు పెట్టుబడి పెట్టించి, నగదు తీసుకునే సమయంలో భారీగా కమిషన్ చెల్లించాలని వేధించారు. బాధితుడు చివరకు రూ. 41.56 లక్షలు నష్టపోయి పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడి ఖాతాను విశ్లేషించగా దేశవ్యాప్తంగా మరో 21 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్లు తేలింది.

సాఫ్ట్‌వేర్ కొలువు ఆశ చూపి.. లక్షలు వసూలు చేసి..
మేడ్చల్: ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను వంచించిన మరో నిందితుడు పోలీసులకు చిక్కాడు. క్యూతుబుల్లాపూర్‌కు చెందిన ఆరుగొండ సాయి కిరణ్ ములే (Mule) ఖాతాదారుడిగా మారి మోసపూరిత సొమ్మును మళ్లిస్తున్నట్లు విచారణలో తేలింది.
వివరాలు: పూణేలోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని బాధితుడిని నమ్మించిన నిందితుడు, వివిధ దఫాలుగా రూ. 4.75 లక్షలు వసూలు చేశాడు. నకిలీ నియామక పత్రాలను సృష్టించి బాధితుడిని మోసం చేశాడు. పని కాకపోగా, నగదు తిరిగి ఇవ్వమని అడిగితే స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

బాధితులకు ఊరట: రూ. 41.58 లక్షల వాపసు
మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు బాధితులకు ఊరట కలిగించారు. పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి, న్యాయస్థానం ద్వారా రూ. 41,58,677/- బాధితులకు తిరిగి చెందేలా చర్యలు తీసుకున్నారు.
జాగ్రత్త సుమీ!

  • గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు.
  • ఆన్‌లైన్ జాబ్ ఆఫర్లు, అధిక లాభాలిచ్చే ట్రేడింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • మోసపోతే తక్షణమే 1930 లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని డీసీపీ (సైబర్ క్రైమ్స్) సూచించారు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News