వారి స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తాం రేవంత్ రెడ్డి దోపిడీని అడ్డుకుంటున్నందుకే నన్ను తిడుతున్నారు నన్ను తిడితే పడతానేమోగాని.. కేసీఆర్ను తిడితే సహించబోను సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ అందుకు ఎంపిటిసి, జడ్పిటిసిలపై వెనకడుగు తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ను గౌరవించాలి డబ్బుల కోసమే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్
అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని విమర్శించారు. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో డోర్స్ క్లోజ్ అయ్యాయని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశమిస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రౌండ్లో బీఆర్ఎస్కు మంచి పట్టు ఉందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 40 శాతం ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు.
పాలమూరురంగారెడ్డి విషయంలో సీఎం రేవంత్రెడ్డి రంధ్రాన్వేషణ వల్ల రాష్టాన్రికే నష్టమని కేటీఆర్ అన్నారు. అనుమతులు దృష్టిలో ఉంచుకుని తాగునీటి పేరుతో పనులు చేశామని చెప్పారు. కేసీఆర్ చిత్తశుద్ధిని కాళేశ్వరం విషయంలో చూడాలన్నారు.మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ మాట్లాడారు. రేవంత్రెడ్డి దోపిడీని అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే దూషిస్తున్నారు. ఆయన తిట్లు నాకు దీవెనలు. నన్ను తిడితే పడతాను కానీ.. కేసీఆర్ను అంటే ఊరుకునేది లేదు. ఆయనకు మంచి పేరు వస్తుందనే పాలమూరురంగారెడ్డి పనులు చేయట్లేదు. కాల్వల కోసం పిలిచిన టెండర్లను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది.
గోదావరిలో నీటి హక్కుల కోసమే కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులను కేసీఆర్ చేపట్టారని కేటీఆర్ అన్నారు. పార్టీని వదిలి వెళ్లిన నేతలను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదన్నది తన అభిప్రాయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ను కాదని భాజపాలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారో చూశాం కదా! నేతల బలం లేకున్నా మా కార్యకర్తలు సర్పంచ్లను గెలిపించుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని న్యాయస్థానంలో పోరాడుతున్నాం.. వారితో మాకేం సంబంధం వారి విషయంలో సీఎం మాటలు విడ్డూరంగా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల నాటికి, సర్పంచ్ ఎన్నికల నాటికి పరిస్థితులు చాలా మారాయి. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు. ప్రజల్లో ప్రభుత్వ పరిస్థితి బాగోలేదు. కడియం నా గురించి ఏం మాట్లాడతారు? వాస్తవాలు దాచలేరు కదా! పోచారం ఈ వయసులో ఏం సాధించారు? గౌరవం నిలబెట్టుకోవాలి కదా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పలకరించడంపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. ముఖ్యమంత్రి సభలో కేసీఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు. ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
డబ్బుల కోసమే జీహెచ్ఎంసీ డీలిమిటేషన్
జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడని.. దాన్ని కూడా తొందరలో ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చని ఎద్దేవా చేశారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని.. కానీ ఇష్టమొచ్చినట్లు చేస్తే ఊరుకోరని తెలిపారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై సభలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చలో అన్ని విషయాలపైనా తాము మాట్లాడతామని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేకుంటారో.. ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్లిష్టమని అన్నారు. కానీ తమకు మాత్రం 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక చారిత్రాత్మక ఎన్నిక అని తెలిపారు. అలాంటి ఎన్నికలు ఇప్పటివరకు చూడలేదని.. మళ్లీ చూడబోమని చెప్పారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచామని గుర్తుచేశారు. గతంలో మేం గెలిచిన సీట్లు ఇంకా ఎవరు గెలవలేరని వ్యాఖ్యానించారు.
