- తీవ్ర స్థాయిలో స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
- డీ లిమిటేషన్ ప్రక్రియతో సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరగదు..
- సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికిన కిషన్ రెడ్డి..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయవద్దని ఆయన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. మేం కూడా దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇక్కడి రాష్ట్రాలకు తాము ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు.
2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రక్రియకు రెండేళ్ల సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ ప్రక్రియను ఎవరు కూడా రాజకీయం చేయవద్దని కోరారు.
దక్షిణాది నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులు అయ్యారని, డీలిమిటేషన్ జరిగితే చప్రాసీ పదవి కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, ఈ వ్యాఖ్యలపై మీరేం సమాధానం చెబుతారని కిషన్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దానికి కిషన్ రెడ్డి స్పందిస్తూ, రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళుతున్నారని, ఎందుకు అలా వెళుతున్నారో ఆయన సమాధానం చెప్పాలని నిలదీశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కావాలన్నా ఆయన ఢిల్లీకి డబ్బులు మోసుకెళుతున్నారని ఆరోపించారు. కానీ బీజేపీలో అలా ఉండదని అన్నారు. అందుకే ఆయన చప్రాసీ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
