- బెంగుళూరులో వెలుగు చూసిన ఘటన..
హాస్టల్లో నివసిస్తున్న కేరళ మహిళను ఒక వ్యక్తి వేధించాడు. ఆమెను అసభ్యకరంగా దూషించడంతో పాటు దాడి చేశాడు. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఇందిరానగర్ ప్రాంతంలోని ప్రముఖ హాస్టల్లో కేరళకు చెందిన 28 ఏళ్ల మహిళ నివసిస్తున్నది.
కాగా, అదే హాస్టల్లో నివసిస్తున్న మను శర్మ చాలా రోజులుగా కేరళ మహిళను వేధిస్తున్నాడు. తామిద్దరం కలిసి ఉందామని పదే పదే అడుగుతున్నాడు. ఆమె నిరాకరించడంతో ఇబ్బంది పెడుతున్నాడు. మహిళ స్నేహితురాలి ద్వారా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాడు.
మరోవైపు మార్చి 11న రాత్రి వేళ ఆ హాస్టల్ ఆవరణలో మను శర్మ హంగామా చేశాడు. గట్టిగా అరవడంతో పాటు తను, తన స్నేహితురాలిని అతడు అసభ్యకరంగా దూషించినట్లు ఆ మహిళ ఆరోపించింది. వాగ్వాదం సమయంలో తమపై భౌతికంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, కేరళ మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. మను శర్మపై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
