- కేసీఆర్ సభకు రాకుంటే పార్టీ పని ఖతం
- ముఖ్యమంత్రి రేవంత్ భాష తీరు దారుణం
- ఉద్యమకారుడిని ఉరి తీయాలంటారా?
- అలా అయితే రేవంత్ను పదిసార్లు తీయాలి
- ప్రతిపక్షనేతను ఉగ్రవాదితో పోల్చడం తప్పు
- హరీష్ రావు బబుల్ షూటర్ మాత్రమే..
- మీడియాతో చిట్చాట్లో కవిత వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే పాలమూరు ` రంగారెడ్డి ప్రాజెక్ట్ను పక్కన పెట్టిన కేసీఆర్ను ఉరి తీయాంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ మీద సీఎం భాష సరికాదన్నారు. కేసీఆర్ను ఒకసారి ఉరితీయాలంటే రేవంత్ రెడ్డిని పదిసార్లు ఉరి తీయాలంటూ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో కవిత మాట్లాడుతూ..
ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్ఎస్ పని ఖతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దంటూ హితవుపలికారు. ఈ విషయంలో ఒక కూతురుగా తన రక్తం ఉడుకుతోందన్నారు. ఉద్యమకారుడిని ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందని చెప్పారు. శాసన మండలి వద్ద మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చాను. కేసీఆర్పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలి.
బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలి. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దు. బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. సొంత జిల్లా మహబూబ్ నగర్కు రేవంత్ తెచ్చిన ప్రాజెక్టులు ఎన్ని అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి కవిత మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఒక బచ్చా అని అన్నారు. ఆయనకు ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసు అంటూ హరీష్ను టార్గెట్ చేస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సభకు రాకపోతే హరీష్ రావే అన్నీ చూసుకోవడం సరికాదని.. కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని కవిత వ్యాఖ్యలు చేశారు.
