- ప్రశ్నలకు సమాధానాలు లేకనే ఓర్వలేనితనమా?
- మంత్రి కోమటిరెడ్డిపై.. కవిత ధ్వజం
నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమం సందర్భంగా తమ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర రహదారులు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నందుకు సమాధానం చెప్పలేక ఫ్లెక్సీలను తొలగించడం హేయమైన చర్య అని ఆమె విమర్శించారు.

”కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మినిస్టర్ అనుకున్నాం. మా వాళ్లు ఉత్సాహంతో ఫ్లెక్సీలు పెడితే ఇంత ఓర్వలేనితనమా?” అని కవిత ప్రశ్నించారు.

ప్రశ్నించడం తప్పా?..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రజా సమస్యలను జాగృతి సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పు కాదని కవిత స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, ఆరోగ్య రంగ సమస్యలు సహా పలు అంశాలపై తాము చేసిన ప్రశ్నలకు మంత్రి వద్ద సమాధానాలు లేకపోవడం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి స్థాయి తగ్గించుకోవద్దు “మేము ప్రశ్నించిన వాటికి సమాధానాలు లేకనే ఫ్లెక్సీలు తీయడం హేళనీయం. ఫ్లెక్సీలు తీయడం అంటే రాజకీయాల్లో మీరు మీ స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది” అని కవిత వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా, తమను అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదని, ఈ వైఖరిని మంత్రి మార్చుకోవాలని ఆమె హితవు పలికారు.
