- ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ, పలుదేశాల న్యాయమూర్తులు
- పదవీ విరమణ చేసిన సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు
- 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్
- సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా రికార్డు
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారంనాడు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు.

2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో రోహక్లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.

2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో పలు కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 370వ అధికరణను రద్దు చేస్తూ చారిత్రక తీర్పు ఇచ్చిన ధర్మసనంలో ఉన్నారు. బిహార్ ఎన్నికల జాబితా రివిజన్, పెగాసస్ స్పైవేర్ తీర్పులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్, కేంద్రమంత్రులు, ఇతరులు పాల్గొన్నారు.
