ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థి పేరును ప్రకటించడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డి(Lankala Deepak Reddy)ని ఎంపిక చేసింది పార్టీ హైకమాండ్. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇద్దరి ముగ్గురి పేర్లు పరిశీలించినా.. ఫైనల్గా దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది బీజేపీ(Bjp) కేంద్ర ఎన్నికల కమిటీ. లంకల దీపక్ రెడ్డికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఇదివరకే పరిచయం ఉంది. ఆయన గతంలో అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు 25 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. తాజాగా అభ్యర్థి ప్రకటన రావడంతో నామినేషన్లకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉన్నందున, బీజేపీ నాయకులు ఇక ప్రచారంలో వేగం పెంచనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్… బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోకల్ కావటం ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థులు గత కొన్ని ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. స్థానికంగా ముగ్గురికి పట్టు ఉన్న ప్రాంతం కావటంతో.. ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా.. ఉత్కంఠగా మారింది.
