గ్రేటర్ జిహెచ్ఎంసి జవహర్ నగర్ పరిధిలోని నార్నియా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 499, 502, 501 పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించి కంచెలు వేసి రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే ఈ చర్యలు కేవలం తాత్కాలిక ప్రయత్నాలుగానే మిగిలిపోతాయా అనే అనుమానాలు స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో కంచెలు వేసిన తరువాత సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కబ్జాదారులు మళ్లీ యథేచ్ఛగా భూములను ఆక్రమించిన ఉదాహరణలు ఉన్నాయని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకు వినియోగించాల్సినవని, పార్కులు, రహదారులు, ప్రభుత్వ సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంచెలు వేయడమే కాకుండా శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని, అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ విషయంలో పై అధికారులు వెంటనే స్పందించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. లేదంటే కంచెలు నాటుట మరోసారి నాటకంగానే మిగిలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
