- ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్.. తక్షణ విచారణకు ఆదేశం..!
- నిందితుడు, విచారణ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంపై తీవ్ర చర్చ!
- విచారణ మొదలు కాకముందే చక్రం తిప్పుతున్న ఓ టీచర్ల సంఘం నాయకుడు..
- ‘ఆదాబ్’ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్న ఓ న్యాయవాది..
నల్లగొండ డైట్ స్కూల్లో చోటుచేసుకున్న కీచక ఉపాధ్యాయుడి సంఘటన మన సమాజంలోని అసమానతలను మళ్లీ మన కళ్లముందుకు తెచ్చింది. ఒక డి.ఎడ్ విద్యార్థిని పట్ల ఓ ఉపాధ్యాయుడు ప్రవర్తించిన అనైతిక తీరు కేవలం ఒక వ్యక్తిగత తప్పిదం కాదు. ఇది విద్యా వ్యవస్థలో దాగి ఉన్న పితృస్వామ్య మనస్తత్వం.
విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు…
ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ తక్షణ విచారణకు ఆదేశాలు ఇవ్వడం అభినందించదగిన విషయం. అయితే నిందితుడు, విచారణ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పెద్ద ఎత్తున ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. న్యాయం అనే పదం వర్గ సంబంధాల బంధంలో పడిపోతే, బాధితులకు న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదు.

విచారణ ప్రారంభం కాకమునుపే.. ఫైరవీలు మొదలుపెట్టిన నాయకుడు…
ఇంకా విచారణ ప్రారంభం కాకముందే, ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు నిందితుడికి మద్దతుగా కదలడం ఆందోళనకరం! ఉపాధ్యాయ వృత్తి సమాజానికి వెలుగునిచ్చే స్థానంలో ఉండాలి. కానీ ఇక్కడ వెలుగుని ఆర్పేసి, కీచకత్వానికి కవచం తొడుగుతున్న వాస్తవం విద్యా రంగం భవిష్యత్తుపై మచ్చ వేస్తోంది. అదే సమయంలో, ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చిన “ఆదాబ్ హైదరాబాద్ ” పత్రికపై ఓ హైకోర్టు న్యాయవాది బెదిరింపులకు దిగడం, పత్రిక స్వేచ్ఛపై దాడి మాత్రమే కాదు, ఇది ప్రశ్నించే గొంతుకను మూయించే ప్రయత్నం కూడా. ఎందుకంటే ఇలాంటి ఘటనలను బయటపెట్టే ధైర్యం కొన్ని పత్రికలే చేస్తుంటాయి. మీడియాను భయపెట్టి, బాధితులను మౌనంలోకి నెట్టి, వర్గ ఆధిపత్యం కొనసాగించాలని కోరుకునే శక్తులు పనిచేస్తున్నాయన్న అనుమానం ఇక్కడ బలపడుతోంది.

విచారణను పూర్తిగా స్వతంత్ర అధికారుల చేతిలో పెట్టాలి
బాధితురాలికి భద్రతతో పాటు మానసిక సహాయం కల్పించాలి. నిందితుడికి ఎంతటి వర్గ రక్షణ ఉన్నా, కఠిన శిక్ష తప్పనిసరి. మీడియాపై బెదిరింపులకు పాల్పడిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ సంఘాలు తమ ప్రతిష్టను కాపాడుకోవాలంటే నిందితులకి మద్దతు కాకుండా బాధితురాలికి తోడుగా నిలవాలి. న్యాయం అనేది వర్గం చూసుకోకూడదు, లింగబేధం చూసుకోకూడదు. సమాజంలో పిడన వర్గాలకు, మహిళలకు రక్షణ కల్పించడం అసలైన రాజ్యాంగబద్ధ ధర్మం. ఈ సంఘటనలో న్యాయం జరిగితే అది ఒక్క బాధితురాలి గెలుపు కాదు, సమాజం మొత్తానికి సమానత్వ గెలుపు. జిల్లా కలెక్టర్ నేరాన్ని తేల్చడమే కాకుండా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేచి చూద్దాం! ఏం జరగనుందో..
