- సింగరేణి మాజీ సీఎండీ శర్మ వ్యాఖ్య
- సంస్థ భవిష్యత్తు సురక్షితం
- సీఎండీ బలరామ్ వెల్లడి
గోదావరిఖని: ప్రతి పనిలో, ప్రక్రియలో పారదర్శకత (Transparency) ఉన్నప్పుడు విజిలెన్స్ (Vigilance) అవసరం అంతగా ఉండదని సింగరేణి (Singareni) మాజీ సీఎండీ ఎ.పి.వి.ఎన్.శర్మ అన్నారు. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నప్పుడే అక్రమాలకు, అవినీతికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. అందువల్ల పారదర్శకతకు పట్టం కట్టాలని సూచించారు. హైదరాబాద్(Hyderabad)లోని సింగరేణి భవన్లో బుధవారం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. 24 ఏళ్ల తర్వాత సింగరేణీయులను ఉద్దేశించి మాట్లాడటం ఆనందం కలిగిస్తోందని తెలిపారు. సింగరేణి బొగ్గు (Coal) ఉత్పత్తితోపాటు ఇతర వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టడం హర్షణీయమని ప్రశంసించారు. రానున్న కాలంలో బొగ్గుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం తగ్గిపోతుందని, ఈ నేపథ్యంలో ముందుచూపుతో సంస్థ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించడం తెలివైన నిర్ణయమని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీఎండీ (CMD) ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. 1998 ప్రాంతంలో మూసివేతకు చేరువగా వెళ్లిన సింగరేణికి తిరిగి ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఎ.పి.వి.ఎన్.శర్మదని వెల్లడించారు. సంస్థ ప్రస్తుతం బహుముఖ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా పురోగతి సాధిస్తోందని అన్నారు. ఒడిశాలో బొగ్గు బ్లాకు ప్రారంభం, రాజస్థాన్తో కలిసి సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, కర్ణాటకలో బంగారం, రాగి అన్వేషణ వంటి చర్యలతో సింగరేణి ‘గ్రీన్ ఎనర్జీ’ సంస్థగా, ‘సింగరేణి గ్లోబల్ లిమిటెడ్’ సంస్థగా విస్తరించనుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావుతోపాటు పలువురు అధికారులు శర్మ సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన్ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న వందన సమర్పణ చేయగా జీఎం (కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
