19వ తేదీ నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం
హైదరాబాద్ బుక్ ఫెయిర్(Hyderabad Book Fair)ను తొలిసారిగా 1985లో అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించారు. అనంతరం.. నిజాం కాలేజీ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కేశవ్ మెమోరియల్ హైస్కూల్ గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో జరిగాయి. తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఏర్పడిన నాటి నుంచి ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. ఏటా పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఈ నెల 19 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. 19న సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదగా ప్రారంభమవుతుందని బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్ తెలిపారు.
పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. రచయితలు తమ పుస్తకాలను విక్రయించుకునేందుకు ప్రత్యేక స్టాల్(Special Stall)ను ఏర్పాటుచేశారు. రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Events) నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి నుంచి రాత్రి 9 గంటల వరకు శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో సైతం ఫెయిర్ నిర్వహిస్తారు. 300లకు పైగా స్టాళ్లు, విభిన్న భాషల పుస్తకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు ఉంటాయి.
బహు భాషల రచయితలు, గ్రంథాలు, పబ్లిషర్స్ ఒక్కచోట చేరితే అదో విజ్ఞాన విశ్వమే కదా. అందుకే చాలా మందికి ప్రీతిపాత్రం గ్రంథాల జాతర. దేవుణ్ని జాతరలో కొలిచినట్లే గ్రంథాలను పరమ పవిత్రంగా భావించే సంస్కృతి భారతీయులది. కొనే వారు, చదివే వారు, సంరంభాన్ని కన్నుల పండువగా తిలకించే వారు, కుటుంబ, స్నేహ, ప్రేమికుల, విద్యార్థుల, రచయితల, కవుల, సాహితీకారుల బృందాలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకునే భాగ్యనగర పుస్తక మేళాకు వెళ్లినవారికి మరచిపోలేని అనుభూతులను మిగులుస్తుందనేది నూటికి నూరు పాళ్లు నిజం.
- రామకిష్టయ్య సంగనభట్ల
