- సెక్యూరిటీ లేకుండా చిక్కడపల్లికి రాగలవా
- నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గట్టిగా బుద్ది చెప్పాలి
- బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షా 64వేల ఉద్యోగాలు
- నోటిఫికేషన్లు ఇచ్చింది.. పరీక్ష పెట్టింది బీఆర్ఎస్
- వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్
- బాకీ కార్డు విడుదల సందర్భంగా హరీష్ విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలని సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సవాల్ విసిరారు. బట్టలూడదీసి ఊడగొడుతారని అంటే ఘాటుగా హరీశ్రావు హెచ్చరించారు. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముందు వేడుకున్నడు, వాడుకున్నడు. అధికారంలోకి వచ్చాక వదిలేసారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పారు. మోసం చేసారు అని హరీశ్రావు ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చిండు. జాబ్ క్యాలెండర్ అని జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసారు. జాబ్ క్యాలెండర్లో చెప్పినట్లు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా రేవంత్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ బోగస్. రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయింది.
జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తం అన్నడు. మాటలు బోగస్ హామీలు బోగస్ అయ్యాయని హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు మీ చేతిలో అవకాశం ఉంది. కొంతమంది నిరుద్యోగులు కూడా నామినేషన్లు వేసారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా జూబ్లిహిల్స్లో ఓడించాలె. ఆనాడు కాంగ్రెస్ను గెలిపించేందుకు బస్సు యాత్ర చేసారు. కాంగ్రెస్కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ను ఓడించారనే విషయం రాహుల్ గాంధీకి అర్ధం కావాలె.

తనతప్పు తాను తెలుసుకునేందుకు మనం కాంగ్రెస్ ను ఓడించాలె అని హరీశ్రావు పిలుపునిచ్చారు. విద్యా శాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. కలెక్షన్ల మంత్రిగా, వసూళ్ల మంత్రిగా మాత్రం పాస్ అయిపోయిండు అని హరీశ్రావు ధ్వజమెత్తారు. జీవో 29, జీవో 56పై నేను ఆనాడు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. భట్టి గారు దళిత మంత్రిగా ఉన్నారు మీరైనా పట్టించుకోండి అంటే పట్టించుకోలేదు. జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నరు.
గల్లా పెట్టెలు నింపుకుంటున్నరు. విద్య రాని వ్యక్తి విద్య శాఖ మంత్రి. అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి హోం మంత్రిగా ఉన్నారని హరీశ్రావు విమర్శించారు. మా ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. నేడు ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నరు. రేవంత్ రెడ్డి గన్ ఇచ్చి పంపించాడు అని మంత్రి కుమార్తె చెప్పింది. ఐఏఎస్ ఆఫీసర్ వీఆర్ఎస్ మధ్యలోనే వెళ్లిపోతున్నడు. లక్షా 64వేల ప్రభుత్వ ఉద్యోగాలను బిఆర్ఎస్ ఇచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆలస్యం అయ్యింది. 5 శాతం లోకల్ రిజర్వేషన్ సాధించాం.
నోటిఫికేషన్లు ఇచ్చింది బిఆర్ఎస్, పరీక్ష పెట్టింది బిఆర్ఎస్, ఫిజికల్ టెస్టు పెట్టింది బిఆర్ఎస్, ఎంపిక చేసింది బిఆర్ఎస్, నియామకపత్రాలు ఇచ్చింది రేవంత్. దీంతో 60వేల ఉద్యోగాలు ఇచ్చినా అని ప్రచారం చేసుకుంటున్నడు రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు మండిపడ్డారు. అందులో 15400 ఎస్సై కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చింది. బిఆర్ఎస్. 9 వేల గురుకులాల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. 8 వేల గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. హెల్త్ డిపార్టుమెంట్లో 7 వేల ఉద్యోగాలు ఇచ్చింది బిఆర్ఎస్.
జేఎల్ 1300, ఆరు వేల టీచర్ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 10 వేల ఉద్యోగాలు మాత్రమే అని హరీశ్రావు పేర్కొన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేం హామి ఇస్తున్నాం. అసెంబ్లీ వేదికగా మీకోసం పోరాటం చేస్తం. మొన్న అడిగితే ఒక్కటే నాడు అసెంబ్లీ పెట్టి పారిపోయిండు. అసెంబ్లీ పెట్టడానికి కూడా భయమే. జెన్కో జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అన్ని జిల్లా కేంద్రంలో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తం. ప్రత్యక్ష పోరాటం బిఆర్ఎస్ చేస్తుంది. మీకు అండగా ఉంటది అని హరీశ్రావు స్పష్టం చేశారు.
