- తెలంగాణలో ప్రాజెక్టులకు పాతర
- గోదావరి జలాల్లో తెలంగాణకు ద్రోహం
- సాగర్ ప్రాజెక్ట్ కోసం రేవంత్ నాటకాలు
- బాబు చేతిలో కత్తి.. పొడుస్తున్నది రేవంత్
- చంద్రబాబుతో దోస్తీతో ఏపీకి లైన్ క్లియర్
- నీటి హక్కులు ఏపీకి అప్పగించే ప్రయత్నం
- సాగునీరు దోపిడీపై హరీశ్ రావు ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్రెడ్డి దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రరావు విమర్శించారు. చంద్రబాబుతో దోస్తీ కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రెస్మిట్ పెట్టి హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కేంద్రానికి 10 డీపీఆర్ లు పంపి ఏడు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క అనుమతి కూడా తేలేదని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ మీటింగ్కు వెళ్లేందుకు ఆదిత్యనాథ్ మినహా తెలం గాణ సోయి కలిగిన ఒక్క ఇంజినీర్ దొరకలేదా..?’ అని హరీష్ రావు ప్రశ్నించారు. మన తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర ఇది. తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా..?
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చేస్తున్నారు. పోనుపోను అంటూనే మీటింగ్లకు అటెండ్ కావడం ఏమిటి..? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పజెప్పడమే మీ చర్చల లక్ష్యమా..?’ అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
ఇవాల్టి ఇరిగేషన్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తెలంగాణకు మరణశాసనం రాయబోతున్నదని చెప్పారు. పోలవరం నల్లమలసాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నది. ఆ కుట్రల తీరును ఒకసారి గమనించండి. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి నాడు ఢిల్లీ మీటింగ్కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాశాడు.
వేయను అంటూనే కమిటీవేసి ఏపీ జలదోపిడికి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్ళి నల్లమలసాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పసలేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమలసాగర్కు మద్దతు ప్రకటించాడు’ అని రేవంత్ కుట్రలను వెల్లడించాడు. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నడు. ఏపీ ఒత్తిడితో ఇవాళ జరుగుతున్న ఢిల్లీ మీటింగ్లో ఇంజినీర్లు పాల్గొంటున్నారు. ఇది పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీల నీటిని గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర.
ఇలాగే గతంలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టింది. ఇప్పుడు కూడా ఏపీ పాలకులు నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నరు’ అని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో గోదావరిలో 400 టీఎంసీలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. గోదావరి మీద 10 డీపీఆర్లు పంపి.. 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు. రెండేళ్లలో ఒక్క డీపీఆర్ పంపింది లేదు. ఒక్క అనుమతి తెచ్చింది లేదు. వార్దా, కాళేశ్వరం మూడు టీఎంసీలకు సగం అనుమతులు వస్తే, పూర్తి చేయకుండా డీపీఆర్ లు వాపస్ చేసింది.
రేవంత్రెడ్డి పాలనలో డీపీఆర్ లు వాపస్ వచ్చిన పరిస్థితి. నువు మన డీపీఆర్లు వాపస్ తెచ్చుకుంటవు, నల్లమలసాగర్కు జెండా ఊపుతవు. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి విడిచిపెట్టిందని హరీష్ రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించారు.
రేవంత్రెడ్డి దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. కేసీఆర్ పాలన గురించి ఎకనామిక్ సర్వే రిపోర్టే స్పష్టం చేసింది. తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది. రెండు కోట్ల 20 లక్షల ఎకరాలు మాగాణిగా మారింది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా అద్భుతమైన ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ద్వారా 17 లక్షల 823 ఎకరాల స్థిరీకరణ, మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైంది. 32 లక్షల ఎకరాల ఆయకట్టు బీఆర్ఎస్ సాధించింది’ అని మాజీ మంత్రి చెప్పారు.
‘బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా నోరు పారేసుకోవడం మానుకుంటే మంచిది. కేంద్రంలోని మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రగతిపథాన్ని వివరిచింది. కళ్లు తెరవండి అనవసరంగా బీఆర్ఎస్ మీద నోళ్లు పారేసుకోకండి’ అని హరీష్ రావు బీజేపీ నేతలకు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఢిల్లీ మీటింగ్ను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేశారు. పాలకులకు ఢిల్లీకి, దావోస్కు తిరగడమే తప్ప పాలన మీద దృష్టి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ సేద్యంపై దృష్టిసారిస్తే, రేవంత్ చోద్యం చూస్తున్నడని ఆరోపించారు.
