- గుజరాత్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం
- రసాయన విషంతో భారత్లో విధ్వంసానికి ప్లాన్
- ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఏటీఎస్
- అరెస్టయిన వారిలో హైదరాబాద్ డాక్టర్
గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడి కుట్రను(Terrorist attack plot) గుజరాత్ యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. ఆయుధాలు, రసాయనాలతో ఉగ్రదాడి చేయాలని ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్ అధికారులు ఆదివారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో హైదరాబాద్(Hyderabad) కు చెందిన వైద్యుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్(Doctor Ahmed Mohiuddin Syed), ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. వీరు గుజరాత్లో ఆయుధాల మార్పిడి కోసం వచ్చి, ప్రమాదకరమైన విష పదార్థం ‘రిసిన్‘(ricin) సహాయంతో దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు సిద్ధమవుతున్నట్లు విచారణలో బయటపడింది. వీరి హ్యాండ్లర్ పాకిస్తాన్ సరిహద్దు మీదుగా భారత్లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపుతున్నట్లు కూడా ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఏటీఎస్ బృందం నవంబర్ 7న గాంధీనగర్ సమీపంలోని అదలాజ్ వద్ద ఏటీఎస్ బృందం దాడి చేసి, డాక్టర్ సయ్యద్ను పట్టుకుంది.

అతని వద్ద నుండి రెండు గ్లాక్ పిస్టల్స్, ఒక బరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్టిడ్డులు, నలుగురి లీటర్ల కాస్టర్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో సయ్యద్ పెద్ద ఎత్తున ఉగ్రచర్యలు చేపట్టాలని, రిసిన్ అనే విష రసాయనాన్ని ఉపయోగించి దాడి చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించాడు. ఏటీఎస్ అధికారులు, సయ్యద్ మిగతా ఇద్దరు అనుచరులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. దేశ భద్రతకు భంగం కలిగించే ఈ ఉగ్ర కుట్రను అడ్డుకున్న ఏటీఎస్ అధికారుల చర్యను పలువురు ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మరొకసారి భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

