- ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకోనున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా
నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ నూతన భవన నిర్మాణానికి బుధవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. హౌసింగ్ బోర్డు పరిధిలో 35 గుంటల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సీఏ రామిడి సంతోష్, సీఏ యర్ర తిరుపతయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐసీఏఐ జాతీయ అధ్యక్షులు సీఏ చరణ్జోత్ సింగ్ నందా ముఖ్య అతిథిగా హాజరై వేదమంత్రాల నడుమ భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐసీఏఐ ఉపాధ్యక్షులు సీఏ ప్రసన్న కుమార్ డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు సీఏ ముప్పాల శ్రీధర్, సీఏ దయానివాస్ శర్మ, సీఏ రేవతి ఎస్ రఘునాథన్ పాల్గొని కార్యక్రమానికి శోభను చేకూర్చారు.దక్షిణ ప్రాంతానికి చెందిన సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు సీఏ బాబు అబ్రహామ్ కల్లివయలిల్, సీఏ మధుకర్ నారాయణ హిరేగంగే, సీఏ రాజేంద్ర కుమార్ పి, సీఏ శ్రీప్రియా కే తదితరులు హాజరై నిర్మాణ పనులకు శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ సభ్యులు సీఏ వనపట్ల శేఖర్ రెడ్డి, సీఏ గాండ్రెడ్డి శ్రీనివాస్, సీఏ బెక్కంటి అజయ్ కుమార్, సీఏ కరుకూరి మల్లేశం, సీఏ మార్గం శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఈ నూతన భవనాన్ని అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 800 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, సిఏ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్మార్ట్ క్లాస్రూమ్స్, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ రూమ్స్, శిక్షణ కేంద్రాలు, పరిశోధన సదుపాయాలు, సభ్యుల పరస్పర సమావేశాల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని టెక్నాలజీ ఆధారిత శిక్షణా కార్యక్రమాలకు అనుకూలంగా భవనాన్ని రూపుదిద్దనున్నట్లు తెలిపారు.ఈ భవనం నిర్మాణం పూర్తయిన తరువాత కరీంనగర్ మాత్రమే కాకుండా పరిసర జిల్లాల సిఏ విద్యార్థులు, వృత్తి నిపుణులకు ఇది ప్రముఖ శిక్షణా కేంద్రంగా మారనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. సిఏ రంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్రాంతానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్లు, సిఏ విద్యార్థులు, ఐసీఏఐ సభ్యులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
