వ్యవసాయం శాస్త్రమని, పరిశోధనే భవిష్యత్తు అని తెలంగాణ గవర్నర్(Governor) జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆయన శుక్రవారం సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని(Mattapalli Sri Lakshmi Narasimha Swamy Temple) సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన అభివృద్ధి, విద్యా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి.
- హుజూర్నగర్ సమీపంలో రూ.150 కోట్ల వ్యయంతో వ్యవసాయ కళాశాల (100 ఎకరాలు)
- కోదాడ సమీపంలో రూ.50 కోట్ల వ్యయంతో జవహర్ నవోదయ విద్యాలయ
- రూ.2 కోట్ల వ్యయంతో యాత్రిక సదన్ & కిచెన్ షెడ్, మట్టపల్లి ఆలయంలో రూ.2 కోట్ల వ్యయంతో వసతి గృహ భవనాలు
- రూ.2.47 కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలు రైతులకు పంపిణీ
- రూ.504 కోట్ల బ్యాంకు అనుసంధానం & స్వయం సహాయక సంఘాలకు రూ.89 కోట్ల జీవనోపాధికి మద్దతు
జాతీయ నినాదం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధన్గా అభివృద్ధి చెందిందని, ఇది పరిశోధన ఆధారిత వ్యవసాయ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందని గవర్నర్ తెలిపారు. నీటి పారుదల & పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో అగ్ర భాగంలో ఉందని, 85% జనాభాకు సన్న బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. మట్టపల్లి అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao) మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యవసాయం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ను కూడా అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో వరి, ఆయిల్ పామ్లో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉందని వెల్లడించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
