27 దేశాల యూరోపియన్ యూనియన్(European Union-EU)కి, ఇండియా(India)కి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(Free Trade Agreements-FTA) కుదరనుంది. దీనిపై రేపు(జనవరి 27న) ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం.. వస్త్రాలు, పాదరక్షలు, కార్లు, వైన్లు, శ్రమ ఆధారిత రంగాలపై సుంకాలను తగ్గించనున్నారు. ఈ మేరకు ఇండియా-EU FTA వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో 24 అధ్యాయాలు ఉంటాయి. వస్తువులు, సేవల వాణిజ్యం తదితర చాప్టర్లు ఇందులో భాగం కానున్నాయి. గొడ్డు మాంసం, చక్కెర, బియ్యం మార్కెట్లకు EU అధిక ప్రాధాన్యం ఇస్తుండగా.. ఇండియాలో వ్యవసాయం, పాడి రంగాలకు పెద్ద పీట వేస్తున్నారు.
ఒప్పందంలో భాగంగా అనేక సేవా రంగాల్లో నిబంధనలను సరళీకరించనున్నారు. ఇండియా.. వస్త్రాలు, తోలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, హస్తకళలకు జీరో-డ్యూటీ యాక్సెస్ కోసం ఒత్తిడి చేసింది. మన దేశం ఖరారు చేసిన అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఇది కీలక డిమాండ్. UK, UAE, ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలతో కుదుర్చుకున్న ప్రతి ఎఫ్టీఏలోనూ ఈ అంశం ఉండటం గమనార్హం. మరోవైపు.. EU తన ఆటోమొబైల్స్, వైన్లు సహా ఆల్కహాలిక్ పానీయాలపై సుంకం తగ్గింపులను డిమాండ్ చేస్తోంది.
