Thursday, February 26, 2026
Homeఆంధ్రప్రదేశ్Adulteration | ఆహార భద్రత గాలికొదిలేశారు

Adulteration | ఆహార భద్రత గాలికొదిలేశారు

  • కల్తీ నియంత్రించే ప్రయోగశాలలు లేక ప్రజారోగ్యానికి పెను ప్రమాదం

ప్రజల ఆహారం సురక్షితంగా ఉండేలా చూడడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రాథమిక బాధ్యత. ప్రజలు తాగే పాలు, వినియోగించే నెయ్యి సురక్షితమని నమ్మలేని పరిస్థితి వస్తే, పాలనపై ప్రశ్నలు తలెత్తుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే, ప్రభుత్వం నిర్మాణాలు ఏర్పాటు చేసినా ప్రజారోగ్యాన్ని కాపాడే కార్యాచరణ సామర్థ్యాన్ని మాత్రం నిర్మించలేదని స్పష్టమవుతోంది. నిత్యం కల్తీ పై మాట్లాడుతున్న ప్రభుత్వం, కల్తీని నిరోధించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టక పోవడం విడ్డూరం

ఏళ్ల తరబడి ఆలస్యం తర్వాత తిరుమలలో సుమారు ₹25 కోట్లతో అధునాతన ఎలక్ట్రానిక్ టంగ్, ఎలక్ట్రానిక్ నోస్ సాంకేతికతతో ఆహార పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు చేశారు. కాగితాలపై ఇది సాంకేతిక పురోగతి కనిపించిన, వాస్తవానికి ఇది తక్కువ సిబ్బందితోనే నడుస్తోంది. దాదాపు ఆరు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి గణనీయంగా తక్కువ మంది ఫుడ్ అనలిస్టుల మాత్రమే ప్రభుత్వ సేవలో ఉన్నారు. తిరుమల ప్రయోగశాలలోనే ముగ్గురు అనలిస్టులు మాత్రమే పనిచేస్తున్నారని సమాచారం.

- Advertisement -

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడలోని ఆహార పరీక్షా ప్రయోగశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ ల్యాబ్ ఒకవైపు విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియంత్రణ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రభుత్వం తన బాధ్యతలో భాగాన్ని ఒక విద్యాసంస్థకు బదిలీ చేసినట్టైంది. ఫలితంగా ఖరీదైన పరికరాలు సరిగా వినియోగంలోకి రాకపోగా నమూనాలను పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

రాజమహేంద్రవరంలో ఒకే సరఫరాదారుని నుంచి కల్తీ పాలు తీసుకున్న వందకు పైగా కుటుంబాల ఘటనతో ఈ పరిస్థితి తీవ్రంగా బయటపడింది. ఐదుగురు మృతి చెందగా, పిల్లలు సహా మరికొందరు ఇంకా విషమ స్థితిలో ఉన్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా విషతత్వ నివేదికలు ఇతర ప్రాంతాల ల్యాబ్‌ల నుంచి రావాల్సి వచ్చింది. స్థానికంగా కలుషిత పదార్థాలు వెంటనే గుర్తించే సామర్థ్యం లేకపోవడం వల్ల నివారణ వ్యవస్థ మరణాల తర్వాత మాత్రమే స్పందించింది.

అధికారులు తరచుగా “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్” మొబైల్ యూనిట్లను పర్యవేక్షణకు ఉదాహరణగా చూపుతున్నారు. ఇది ప్రాథమిక కల్తీ లను మాత్రమే గుర్తించగలవు. కానీ పురుగుమందు అవశేషాలు, యాంటీబయాటిక్ విశేషాలు, హెవీ మెటల్స్, అప్లాటాక్సిన్, హార్మోన్ కలుషితాలు వంటి సంక్లిష్ట పదార్థాలు గుర్తించలేవు. ఇవి కేవలం ప్రాథమిక స్క్రీనింగ్ సాధనాలు మాత్రమే. ధృవీకరణాత్మక ప్రయోగశాలలు లేకుండా చట్టపరమైన చర్యలు కష్టమవుతాయి, దీంతో కల్తీదారులు భయపడకుండా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతుంది.

అసలు సమస్య మానవ వనరుల్లో ఉంది. అర్హత కలిగిన ఫుడ్ అనలిస్టుల నియామకాలు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి లేదా ఆమోదించబడలేదు. ఉన్న సిబ్బంది ఆధునిక పరికరాలపై తగిన శిక్షణ లేకపోవడంతో పరీక్షలు పరిమిత ప్రమాణాలకే కుదురుతున్నాయి. ఫలితంగా పశువైద్య ఔషధ అవశేషాలు, యాంటీబయాటిక్ కలుషితం, పురుగుమందు అవశేషాలు వంటి ప్రమాదకర పదార్థాలు గుర్తించకుండా మిగిలే అవకాశముంది. ల్యాబ్‌లు ఉన్నా సమగ్ర పరీక్షలు లేవు.

పరీక్షల సామర్థ్యం తక్కువగా ఉండటంతో నమూనాలను తరచూ రాష్ట్రం వెలుపల లేదా ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపాల్సి వస్తోంది. జేఎన్‌టీయూ కాకినాడ ల్యాబ్‌పై అధిక భారం పడుతోంది. నివేదికలు రావడానికి వారాలు, నెలలు పడుతున్నాయి. అప్పటికి కల్తీ ఉత్పత్తులు వినియోగంలోకి వెళ్లిపోయి ఉండవచ్చు. ల్యాబ్‌లను బలోపేతం చేయడానికి పంపిన ప్రతిపాదనలు సంవత్సరాలుగా అమలుకాకుండా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ప్రజారోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నియంత్రణ వ్యవస్థ భవనాల సంఖ్యపై కాకుండా పరీక్షల వేగం, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ధృవీకరణకు నెలలు పట్టితే పర్యవేక్షణ ప్రభావం కోల్పోతుంది. నివారణ బదులు నష్ట నియంత్రణకు వ్యవస్థ పరిమితమవుతుంది.

ఇటీవలి ఘటనలు ప్రకటనలు మరియు సిద్ధత మధ్య ఉన్న నిర్మాణాత్మక అంతరాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఆధునిక పరికరాలు ఉన్నా శిక్షణ పొందిన సిబ్బంది, సమయానుకూల పరీక్షా సామర్థ్యం లేనప్పుడు వినియోగదారులకు నిత్యావసర ఆహారంపై అనిశ్చితి నెలకొంటుంది. నియంత్రణ సంస్థల చర్యలు పరిమితమవుతాయి. బాధితులకు మాత్రం ఆలస్యంగానే సహాయం అందుతుంది.

ప్రస్తుతం రాష్ట్ర ఆహార భద్రతా వ్యవస్థలో మౌలిక వసతులు ఉన్నా కార్యాచరణ సిద్ధత లేకపోవడం వల్ల ప్రజారోగ్యం భరోసా కంటే యాదృచ్ఛికతపై ఆధారపడుతున్నదనే ఆందోళన కలుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News