చైర్మన్ (Chairman) అర్వింద్ పనగరియా (Arvind Panagariya) ఆధ్వర్యంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం (Finance Commission) తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు సమర్పించింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మోదీ(PM Modi)కి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)కి కూడా నివేదిక కాపీలను అందజేశారు.
ఫైనాన్స్ కమిషన్ విధివిధానాలను 2024 నవంబర్ 29న ఆమోదించిన కేంద్ర క్యాబినెట్(Cabinet).. 2025 అక్టోబర్ 31లోపు నివేదిక సమర్పించాలని గడువు విధించింది. అయితే.. ఆ గడువు దాటిన 17 రోజులకు రిపోర్ట్ సమర్పించారు. 16వ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఐదేళ్లపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల నికర ఆదాయ పంపిణీకి సంబంధించిన సిఫారసులు చేయనుంది. దీంతోపాటు.. ఏ రాష్ట్రానికి ఎంత కేటాయింపులు చేయాలనేదీ సూచిస్తుంది.
రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరియు విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు ఆర్థిక సహాయంపై ఏర్పాట్లను సమీక్షించి తగిన సలహాలు ఇస్తుంది. దేశంలోని ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని వర్గాలతో చర్చలు, సంప్రదింపులు జరిపి ఈ నివేదికను రెండు భాగాలుగా రూపొందించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.
