- మండల వ్యవసాయ అధికారిని అనురాధ వెల్లడి
రైతు అభివృద్ధికి రైతు రిజిస్ట్రేషన్ చాలా అవసరమని మొయినాబాద్ మండల వ్యవసాయాధికారిని అనురాధ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు రిజిస్ట్రేషన్ చేస్తే రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయని, దీంతో రైతులకు రావాల్సిన పథకాలు సకాలంలో అందుతాయన్నారు. రైతు రిజిస్ట్రేషన్ ఉంటే పీఎం–కిసాన్, రైతు బీమా, పంటల బీమా, ఎరువులు, విత్తనాలు, సబ్సిడీలు, రాయితీలు వంటి ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు అందుతాయని తెలిపారు. భూమి వివరాలు, పంట వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ ఒకేచోట నమోదు కావడం వల్ల జాప్యం లేకుండా రైతులకు సేవలు అందుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రి స్టాక్ – తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం ద్వారా ప్రతి రైతు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలతో సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఇందుకు ఎలాంటి ఫీజు ఉండదని తెలిపారు. మొయినాబాద్ మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వెంటనే తమ రైతు రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అనురాధ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
