బీఆర్ఎస్ పార్టీ (Brs Party) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్పై కక్ష్య సాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్ (E Car Race)లో విచారణకు ఏసీబీ విచారణకు గవర్నర్ (Governor) అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీలు BRS పార్టీపై కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లామైందన్నారు. BRS ను కట్టడి చేయడానికి KTRని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి, BJP కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చినపుడు, ఎలక్షన్లు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్ రెడ్డి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించారు. రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్పై విచారణ పేరుతో కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని చెప్పారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేయగలం అనుకోవడం పొరపాటేనని పేర్కొన్నారు. మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు అయ్యే వరకు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. కేటీఆర్కు భీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. న్యాయ స్థానాలపై తమకు నమ్మకం ఉందని, మీరు చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని చెప్పారు.
