విదేశీ ప్రయాణికుల కోసం ఇండియా కొత్తగా ఇ-అరైవల్ కార్డుల(E-Arrival Cards)ను ప్రారంభించింది. దీంతో.. ఇకపై సంప్రదాయ పేపర్ కార్డ్కి బదులు ఎలక్ట్రానిక్ అరైవల్ ఫామ్ని సమర్పిస్తే సరిపోతుంది. అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ డిజిటల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఈ కార్డులను ఏవిధంగా పొందాలి అనే వివరాలను తెలుసుకుందాం.
వంద శాతం డిజిటల్ ఇండియా (Digital India) దిశగా పయనిస్తున్న మన దేశం ఒక్కో వ్యవస్థలో క్రమక్రమంగా మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఇతర దేశాల నుంచి ఇండియాలోకి ఈజీగా ప్రవేశించటం కోసం ఎంట్రీ ఫార్మాలిటీస్ని సరళీకరిస్తోంది. తద్వారా ఎయిర్పోర్టుల పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. డేటా ఖచ్చితత్వాన్ని పెంచుతోంది. ఇమిగ్రేషన్ విధానాలను పూర్తిగా ఆన్లైన్ చేస్తోంది.
ఇ-అరైవల్ కార్డుల కోసం ఇండియన్ వీసా (Indian Visa) వెబ్సైట్లో గానీ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్లో గానీ సు-స్వాగతం అనే మొబైల్ యాప్లో గానీ అప్లై చేసుకోవచ్చు. జర్నీకి మూడు రోజుల ముందు ఈ ప్రక్రియను పూర్తిచేయాలి. ప్రస్తుతం ఇ-అరైవల్ కార్డులు తెర మీదికి వచ్చినప్పటికీ పేపర్ అరైవల్ ఫామ్స్ను కూడా మరో ఆరు నెలల పాటు అనుమతిస్తారు.
విదేశీ ప్రయాణికులు ఇ-అరైవల్ కార్డులు పొందేందుకు ప్రోత్సహిస్తున్నామని, తద్వారా వారికి వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా రాయబార కార్యాలయ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఫార్మాలిటీస్ని ముందే పూర్తి చేస్తే ప్రయాణికులు విమానాశ్రయాల్లో బారులు తీరాల్సిన పని లేకుండా, మ్యానువల్ డేటా ప్రాసెసింగ్ను తగ్గించేందుకు ఇ-అరైవల్ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు.
ఇ-అరైవల్ డిజిటల్ ఫామ్ కోసం ఇండియన్ వీసా ఆన్లైన్ వెబ్సైట్ని సందర్శించాలి. ఇందులోని పర్సనల్ డిటెయిల్స్ సెక్షన్లో పర్సనల్, ట్రావెల్, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. పాస్పోర్ట్ ప్రకారం పూర్తి పేరు, జాతీయత, పాస్పోర్ట్ నంబర్, ప్రయాణ ఉద్దేశం వంటి వివరాలు ఎంటర్ చేయాలి. అరైవల్ డిటెయిల్స్ సెక్షన్లో గమ్యానికి చేరుకునే తేదీ, గత ఆరు నెలల్లో ప్రయాణించిన దేశాలు వెల్లడించాలి.
ఇ-అరైవల్ ఫామ్కి, ఇ-వీసా ప్రాసెస్(Visa Process)కి చాలా తేడా ఉందని, ఈ రెండూ పూర్తిగా భిన్నమని యూఎస్ ఎంబసీ పేర్కొంటోంది. అమెరికా పౌరులు ఇప్పుడు చెల్లుబాటయ్యే ఇ-వీసాతో ఇండియాకి వెళ్లొచ్చని చెబుతోంది. ఇండియన్ ఎంబసీ లేదా కాన్సులేట్ ఇచ్చే ఫిజికల్ వీసాతోనూ ప్రయాణం చేయొచ్చని అంటోంది. అలాగే.. వాలిడ్ ఇ-అరైవల్ ఫామ్తో సైతం భారత్లోకి ప్రవేశించొచ్చని స్పష్టం చేస్తోంది.
