ఉమ్మడి మెదక్ జిల్లా (Joint Medak District) దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy).. సీఎం రేవంత్ (CM Revanth) తీరుపై మండిపడ్డారు. హాస్టల్స్లో విద్యార్థులకు సరైన తిండి (Food) పెట్టలేరు గానీ కోట్ల రూపాయలతో ఫుట్బాల్ మ్యాచ్(Foot Ball Match)లా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదోవ పట్టించడానికి రేవంత్ పడరాని పాట్లన్నీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలనను గాలికొదిలేసి, నాలుగు గుడారాలు వేసి, ఫ్యూచర్ సిటీ (Future City) అని పేరు పెట్టి గ్లోబల్ సమ్మిట్ (Global Summit) గమ్మత్తు పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాల(Minority Residential School)లో రాత్రి భోజనం తిన్న 16 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలతో కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రి(King Koti Government Hospital)లో చికిత్స తీసుకుంటున్నారు. అది తెలుసా మీకు?. విద్యా శాఖను నిర్లక్యం చేస్తూ ఫుట్ బాల్ ఆడుతూ రీల్స్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారు. పాలకుడిగా మీకు కనీస బాధ్యత లేదా. ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక సీఎం వ్యవహరించినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. రేవంత్ తీరు చూస్తుంటే.. మింగ మెతుకు లేదు గానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లు ఉంది. గురుకులాల్లో పిల్లలకు సరైన తిండి పెట్టలేని మీకు కోట్ల రూపాయలతో ఫుట్ బాల్ మ్యాచ్లు ఎందుకు’ అని కొత్త ప్రభాకర్ రెడ్డి నిలదీశారు.
