ఉన్నతాధికారులతో ఉప్పల్ స్టేడియం సందర్శన
పటిష్టమైన భద్రతను ఏర్పాటుచేయాలని ఆదేశం
ప్రజలకు, ప్రేక్షకులకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచన
ఈ నెల 13న (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనున్న లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఫుట్బాల్ మ్యాచ్ (Foot Ball Match) ఏర్పాట్లను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి.శివధర్ రెడ్డి (Shivadhar Reddy) పరిశీలించారు. భద్రతతోపాటు ఇతర ఏర్పాట్లపై ఆయన గురువారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం(Uppal Stadium)లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం (Review Meeting) నిర్వహించారు. మ్యాచ్ సమగ్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), విద్యుత్ శాఖ, వాటర్ వర్క్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులతోపాటు మ్యాచ్ నిర్వాహకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ శాఖల ద్వారా జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీకి వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. మ్యాచ్కు తరలివచ్చే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుట్బాల్ ప్రొఫెషనల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్తోపాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొంటున్నందున భద్రతాపరమైన ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ మేరకు మెట్రో రైళ్లలో, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసే ప్రచార బోర్డుల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలపాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా అధికారులు ఉప్పల్ స్టేడియంలోని భద్రతాపరమైన అనుకూలతలను డీజీపీకి వివరించారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, సెక్యూరిటీపరంగా చాలా అనువైనదని తెలిపారు. స్టేడియాన్ని సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనే 4 ప్రధాన సెక్టర్లుగా విభజించామని, దాదాపు 39 వేల మంది కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియానికి ఉందని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించాలని డీజీపీ అన్నారు.
ఈ సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, అడిషనల్ డీజీపీ (సీఐడీ) చారు సిన్హా, అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) విజయకుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ పద్మజ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె.శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
